Sunday, October 31, 2021

హ్యాపీ చిల్డ్రన్స్‌ డే ! | పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ | బాలల దినోత్సవం




పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, నవంబర్‌ 14వ తేదీన జన్మించారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకునే మనం బాలల దినోత్సవం జరుపుకుంటాం. ఈ విషయాన్ని స్వయంగా చాచాజీ (నెహ్రూ పిల్లలు ముద్దుగా పిలుచుకునే పేరు)నే చెప్పారు. నవంబర్ 14వ తేదీని నా జన్మదినంగా గుర్తించవద్దనీ, ఆ రోజును "బాలల దినోత్సవం"గా గుర్తించాలని చాచాజీ చెప్పారు. అందుకే మనం చాచా నెహ్రూ జన్మదినోత్సవాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. బాలల బంగారు భవిష్యత్తులోనే భారతదేశ భవితవ్యం ఆధారపడి ఉందని చెప్పిన మహానుభావుడు మన జవహర్ లాల్ నెహ్రూ..! ఈ సందర్భాన్ని పురస్కరించుకున్న పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే దిశగా పాఠశాలలు పది రోజుల ముందు నుంచే ఈ వేడులను నిర్వహిస్తుంటారు. స్కూళ్లల్లో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం, కోలాహలంగా పిల్లలతో ఆడి, పాడించడం, వ్యాస రచన, వకృత్వ పోటీలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ పోటీల్లో గెలుపొందినవారికి బహుమతులు ప్రదానం చేయడం కూడా జరుగుతుంది.


భారతదేశ తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ. అత్యధిక కాలం ప్రధానిగా సేవలు అందించింది కూడా ఆయనే. బ్రిటిష్ వలసవాదుల దోపిడీకి గురైన భారతావని నేడు ఆర్థికంగా పరిపుష్టి సాధించిందంటే అందులో నెహ్రూ దార్శనికత, ముందుచూపు కారణం. ప్రధానిగా ఆయన అనుసరించిన విధానాలు దేశం ఆర్థికంగా బలపడటానికి పునాదులు వేశాయి. 1889 నవంబర్ 14న అలహాబాద్‌లో జన్మించిన నెహ్రూ భారత జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఈ సమయంలో పలుసార్లు జైలుకు వెళ్లిన నెహ్రూ.. అక్కడ ఉన్నప్పుడే‘గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ, ది డిస్కవరీ అఫ్ ఇండియా’ గ్రంథాలు రచించారు. 


తొలిసారి 1929లో భారత జాతీయ కాంగ్రెస్‌కు నాయకత్వం వహించారు. 1936, 1937 తర్వాత 1946లలో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను నిర్వహించారు. జాతీయోద్యమంలో గాంధీజీ తర్వాత రెండో ప్రముఖ నాయకుడిగా అవతరించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాంగ విధానంలో సోషలిజం వైపు మొగ్గి రష్యాతో మైత్రికి ప్రాధాన్యత ఇచ్చారు. చైనాతో పంచశీల ఒప్పందం.. అలీనవిధానం ప్రతిపాదించిన త్రిమూర్తులలో ఒకరుగా ప్రసిద్ధి చెందారు. పంచవర్ష ప్రణాళికలను ప్రారంభించి దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారు.


ఇక, నెహ్రూకు పిల్లలన్నా, గులాబీలన్నా అమితమైన ప్రేమ. నెహ్రు ఎక్కడికెళ్లినా.. పిల్లలను వెతికి మరీ ఆప్యాయంగా పలకరించేవారు. వారికి కానుకలను ఇచ్చి ఉత్సాహపరిచేవారు. స్వాతంత్ర పోరాటంలో భాగంగా జైల్లో ఉన్నప్పుడు తన కుమార్తె ఇందిరకు అనేక ఉత్తరాలు రాసేవారు. స్వతహాగా రచయిత అయిన నెహ్రు తన కుమార్తెకు రాసిన ఉత్తరాల్లో బోలెడు మంచి విషయాలు చెప్పేవారు. పిల్లలు ఎలా ఉండాలి? ఎలాంటి విషయాలు నేర్చుకోవాలి? సమాజంలో మంచి, చెడులను ఎలా గ్రహించాలి? సమస్యలను ఎలా అధిగమించాలి తదితర అంశాలను కూలంకషంగా వివరించేవారు. నెహ్రూ నింపిన స్ఫూర్తి, ధైర్యంతో ఇందిర ‘ఉక్కు మహిళ’గా రూపొందారు. ప్రధానిగా పలు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని దేశాన్ని ముందుకు నడిపారు. తన కుమార్తె ఇందిరకు నెహ్రు రాసిన ఉత్తరాలు నేటి తరానికి పాఠాలయ్యాయి. ఆయన చెప్పిన ఆ మంచి మాటలు మనం ఎప్పటికీ ఆచరించదగినవే. 


పిల్లలకు కూడా పండిట్ నెహ్రూ అంటే వల్లమానిన ప్రేమ. ఆయణ్ని ముద్దుగా ‘చాచా నెహ్రూ’, ‘చాచాజీ’ అని పిలుచుకుంటారు. ఇష్టమైన మేనమామ/ బాబాయి అని దీని అర్థం. 1964లో నెహ్రూ మరణించిన తర్వాత ఆయన పుట్టిన రోజును ‘బాలల దినోత్సవం’గా నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. నాటి నుంచి నవంబర్ 14ను ‘చిల్డ్రన్స్ డే’గా జరుపుకొంటున్నాం. స్వాతంత్య్రానికి ముందు బాలల దినోత్సవాన్ని నవంబర్ 20న అన్ని దేశాలతోపాటు నిర్వహించుకునేవాళ్లం. నవంబరు 20న చిల్డ్రన్స్ డే నిర్వహించాలని ఐక్యరాజ్య సమితిలోని సభ్యదేశాలు తీర్మానించాయి. 1964 వరకు భారత్ కూడా దీనినే అనుసరించినా నెహ్రు మరణం తర్వాత నుంచి నవంబర్ 14న చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నాం.



ఈ రోజున పాఠశాలల్లో పండగ వాతావరణం ఉంటుంది. పిల్లలకు ఇష్టమైన చాక్లెట్లు, ఇతర కానుకలను పంచిపెడతారు. వ్యాస రచన, క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తారు. అనంతరం సాంసృతిక కార్యక్రమాలతో పిల్లల్లో ఉత్సాహం నింపుతారు.
 

NANDITHA AKUNURI

No comments:

Post a Comment

ThanQ for your comment...