Wednesday, April 21, 2021

వాల్మీకి రామాయణం - బాలకాండ |VALMIKI RAMAYAN | BALA KANDA | APSSC | TELUGU NON DETAIL |10th CLASS |CBSE TELUGU

వాల్మీకి రామాయణం
రామాయణం
 

రామాయణాన్ని ఎందుకు చదవాలంటే ... మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం . మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ . 'అమ్మానాన్నల అనురాగం , పుత్రుల అభిమానం - అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం - గురుభక్త, శిష్యానురక్తి - స్నేహఫలం, ధర్మబలం వినయంతో ఒదగడం , వివేకంతో ఎదగడం - జీవకారుణ్యభావన, ప్రకృతిలాలన'-ఇలా జీవిత పార్శ్వాలనెన్నింటినో పట్టి చూపిస్తుంది రామాయణం. రామాయణాన్ని చదవడమంటే జీవితాన్ని చదవడమే. రామాయణం పారాయణ గ్రంథంకాదు, ఆచరణ ప్రధాన గ్రంథం . ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనిషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది . చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్నందిస్తుంది. “రామో విగ్రహవాన్ ధర్మః సత్యధర్మ పరాక్రమః "అన్న మహితోక్తిని మారీచుని నోటినుండి మహర్షి పలికించాడు. రామునివంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శకావ్యం 'నభూతో నభవిష్యతి!' మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది. ప్రపంచ సాహిత్యంలోనే ఆదికావ్యం రామాయణం . 


వాల్మీకి మహర్షి దీనిని రచించి ' ఆదికవి'గా కీర్తి పొందాడు . ' రామాయణం , పౌలస్త్యవధ , సీతాయాశ్చరితం మహత్ ' అనే మూడు పేర్లు దీనికున్నాయి . ఆరు కాండల ( విభాగం ) తో , ఇరవై నాలుగు వేల శ్లోకాలతో , సంస్కృత భాషలో సాగిన రచన ఇది . తరువాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి . మన దేశంలోనే కాదు ప్రపంచంలోని పలుదేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది . వారి వారి ప్రతిభననుసరించి వాల్మీకి కథకు జోడింపులు చేసిన కవులూ ఉన్నారు . అవే నిజం అన్నంతగా ప్రచారం పొందాయి కొన్ని సంఘటనలు . వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం ఇది . సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాలవారికి స్ఫూర్తి కోసం చేసిన రచన ఇది .



బాలకాండం శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించే నారదమహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు . నారదుడు తపస్వి , వాక్చతురుల్లో శ్రేష్ఠుడు. వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారినడిగాడు ( జిజ్ఞాసే విజ్ఞానానికి మూలం ) . ' ఓ మహర్షీ ! అన్నీ మంచి గుణాలు కలవాడు, ఎలాటి ఆపదలు చుట్టుముట్టినా తొణకనివాడు, ధర్మం తెలిసినవాడు, ఆశ్రయించినవారిని ఆదుకునేవాడు, మాటతప్పనివాడు , సకల ప్రాణులకు మేలుచేసేవాడు, వీరుడు, ధీరుడు, అసూయలేనివాడు, అందమున్నవాడు... ఇలాంటి శుభలక్షణాలు కలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నాడా ? ' అని ప్రశ్నించాడు. నారదుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. ' మహామునీ ! ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకోవడం సాధారణంగా జరగదు . కానీ, నీవు తెలిపిన విశిష్ట గుణాలన్నీ మూర్తీభవించినవాడు శ్రీరాముడ'ని తెలిపాడు . రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకికి వినిపించాడు నారదుడు . అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది. నారదుని మాటలు ఇంకా చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతున్నాయి . గంగానదీ సమీపానగల తమసానదికి స్నానం చేయడానికి బయల్దేరాడు. భరద్వాజాది శిష్యులు వెంట నడుస్తున్నారు. తమసానది మంచివాని మనసువలె స్వచ్ఛంగా ఉంది. స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూవున్న ప్రకృతి అందాలకు పరవశిస్తున్నాడు. సమీపంలో ఒక కొమ్మపైన క్రౌంచ పక్షుల జంటను చూశాడు. వాటి అనురాగం ముచ్చటగొలుపుతున్నది . వాటి మధురధ్వసులు వీనులవిందు చేస్తున్నాయి . ఇంతలో ఒక వేటగాడు క్రూరబాణంతో మగపక్షిని నేలకూల్చాడు. అది నెత్తురోడుతూ విలవిలలాడుతూ ప్రాణాలను విడచింది. ఆ ఎడబాటును తట్టుకోలేని ఆడపక్షి తల్లడిల్లిపోయింది. హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి, కరుణరసం జాలువారింది. ధర్మావేశం కట్టలు తెంచుకుంది. వెంటనే నోటి వెంట అప్రయత్నంగా... 
మానిషాద ప్రతిష్టాంత్వ మగమః శాశ్వతీ! 
సమా : యత్ క్రౌంచమిధునాదేకమ్ అవధీః కామమోహితమ్ || 
( ఓ కిరాతుడా ! క్రౌంచపక్షి జంటలో పరవశమైయున్న ఒక పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు ) అన్న మాటలు వచ్చాయి. అననైతే అన్నాడు కానీ తరవాత అతనికే ఆశ్చర్యంవేసింది . 
 

ఈ మాటలు సమానాక్షరాలుగల నాలుగు పాదాలతో లయబద్ధంగా వచ్చాయి. ఇది ఛందోబద్ధమైన శ్లోకమేనని నిర్ధారించుకున్నాడు . శోకం నుంచి శ్లోకం పుట్టింది. ఆశ్రమానికి తిరిగివచ్చారందరూ, కాని క్రౌంచపక్షి దారుణ దృశ్యం మాత్రం వాల్మీకి మనసునుంచి వెనుదిరగడం లేదు. అదే ఆలోచన. అదే ఆవేదన. ఇంతలో సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకిని చూడడానికి ఆశ్రమానికి వచ్చాడు. అతనికి శాస్తోక ఉపచారాలన్నీ చేశాడు వాల్మీకి, బ్రహ్మవాల్మీకిని కూర్చోమన్నాడు. బ్రహ్మ ఆసనంకన్నా కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనం పైన కూర్చున్నాడు వాల్మీకి. ఇది పెద్దలపట్ల ప్రవర్తించవలసిన తీరు . బ్రహ్మ ఎదురుగా ఉన్నా క్రౌంచపక్షి బాధ వాల్మీకిని వదలడం లేదు . మనసులో ' మానిషాద ' శ్లోకమే మళ్ళీ ధ్వనించింది . అన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వును చిందిస్తూ ' ఓ ఋషీశ్వరా ! నీవు పలికినది శ్లోకమే . అది నా సంకల్ప ప్రభావం . ఈ ఛందస్సు ( అనుష్టుప్ ) లోనే శ్రీరామచరిత్రను రాయమని ఆదేశించాడు . నారదుడు స్పష్టంగా వివరింపని రామకథా రహస్యాలు కూడా స్ఫురిస్తాయని అనుగ్రహించాడు. ఈ భూమండలంలో పర్వతాలు, నదులు ఉన్నంతకాలం రామాయణగాథను జనులు కీర్తిస్తూనే ఉంటార'ని ఆశీర్వదించాడు. బ్రహ్మ ఆదేశానుసారం రామాయణరచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి.
 

అయోధ్యా నగరం: సరయూ నదీతీరంలో “ కోసల ' అనే సుప్రసిద్ధ దేశముంది. అందులోనిదే' అయోధ్యా' అనే మహానగరం.' అయోధ్యా' అంటే యోధులకు జయించడానికి శక్యంకానిది. మనువు దీన్ని నిర్మించాడు. కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. అతడు సూర్యవంశం వాడు. మహావీరుడు. దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నోమార్లు యుద్ధం చేసినవాడు. ధర్మపరాయణుడు . ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకునేవాడు . వశిష్ఠ , వామదేవులు అతని ప్రధానపురోహితులు. సుమంత్రుడు మొదలుగాగల ఎనిమిది మంది మంత్రులు. ఇతని పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో విలసిల్లింది. ప్రజలు ధర్మవర్తనులై సుఖసంతోషాలతో ఉన్నారు.' యథారాజా తథా ప్రజా!' - రాజు ఎలా ఉంటే ప్రజలూ అలాగే ఉంటారు. ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుణ్ణి కుంగదీసింది. సంతానప్రాప్తి కోసం అశ్వమేధయాగం చేయాలన్న ఆలోచన కలిగింది. వెంటనే పురోహితులు, గురువులతో సమావేశమయ్యాడు. మనసులోని మాట చెప్పాడు. వారు తథాస్తు అన్నారు. సరయూనదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది. మంత్రీ సారథీ అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమౌతుందని సూచించాడు. ఋష్యశృంగుడు విభాండక మహర్షి కుమారుడు . నిష్టాగరిష్ఠుడు. అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి . దశరథుని ఆజ్ఞమేరకు ఋష్యశృంగుణ్ణి సగౌరవంగా తోడ్కొనివచ్చారు. మూడు రోజులపాటు అశ్వమేధయాగం శాస్తోక్తంగా నిర్వహించారు . తరవాత దశరథుడు ఋష్యశృంగునితో పుత్రప్రాప్తి కోసం చేయవలసిన క్రతువును గురించి అడిగాడు . ఆ భారాన్ని ఋష్యశృంగునిపైనే ఉంచాడు. దశరథుని అభ్యర్థనను మన్నించిన ఋష్యశృంగుడు' పుత్రకామేష్టి' అనే యాగాన్ని ప్రారంభించాడు. హవిస్సులందుకోవడానికి బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు. అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. రావణాసురుడు బ్రహ్మ వరప్రభావంచేత విర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురిచేస్తున్నారన్నారు . ముల్లోకాలను బాధించడమేగాక ఇంద్రుణ్ణి సైతం రాజ్యభ్రష్టుణ్ణి చేయడానికి పూనుకొన్నాడని తెలిపారు. అతని దుండగాలకు అంతేలేదన్నారు. ఋషుల, యక్షగంధర్వుల మాట అటుంచి అతని భయంతో సూర్యుడు, సముద్రుడు, వాయువు కూడా తమ సహజస్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు. అతని పీడ విరగడయ్యే ఆలోచనను బ్రహ్మనే చెప్పమని వేడుకున్నారు. బ్రహ్మ దేవతలతో ' రావణుడు గంధర్వ, యక్ష, దేవ, దానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు. మానవుల పట్ల అతనికి చులకనభావం . అందుకే వారి గురించి ప్రస్తావించలేదు. కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉంద'ని అన్నాడు. ఇంతలో శ్రీమహావిష్ణువు శంఖచక్రగదాధారి అయి వచ్చాడు. దేవతలు ఆ దేవదేవుణ్ణి అనేక విధాలుగా స్తుతించారు. వరగర్వంచేత కన్నూమిన్నూ గానక ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించడానికి మానవుడిగా అవతరించమని అభ్యర్థించారు. దశరథ మహారాజు గారి ముగ్గురు భార్యలకు నాలుగు రూపాలలో పుత్రుడవు కమ్మని ప్రాధేయపడ్డారు. అభయమిచ్చాడు ఆశ్రితవత్సలుడు. అందరి పూజలందుకొని అంతర్థానమయ్యాడు .

దశరథుడు పుత్రకామేష్టి చేసినప్పుడు యజ్ఞకుండం నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్యపురుషుడు ఆవిర్భవించాడు . అతడు బ్రహ్మపంపగా వచ్చినవాడు. చేతిలో బంగారు పాత్ర వెండిమూతతో. అందులో దివ్యపాయసముంది. దాన్ని దశరథునకందించాడు.' ఈ పాయసం సంపదలనిస్తుంది. ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అన్నిటినీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుంద'న్నాడు. పేదవానికి పెన్నిధి దొరికినట్లైంది. దశరథునికి . అతని మనస్సు ఆనందతాండవం చేసింది . దిష్య పాయసాన్ని తన భార్యలైన కౌసల్య, సుమిత్ర , కైకేయిలకు పంచాడు. సంవత్సర కాలం గడిచింది. చైత్ర శుద్ధనవమినాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. దశమినాడు కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ , శత్రుఘ్నులు జన్మించారు . ఈ వార్త విన్న అయోధ్య ఆనందసంద్రమైంది . రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు. వేదశాస్త్రాలనభ్యసించారు. ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు. విజ్ఞానఖనులయ్యార సద్గుణాలకు ఆటపట్టినారు ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలివి. రాముడు ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేవాడు. చిన్ననాటి నుంచీ అన్న సేవే మిన్నగా భావించేవాడు లక్ష్మణుడు. ఇతడు రాముడికి బహిఃప్రాణం. భరతశత్రుఘ్నులు అన్యోన్య ప్రేమాభిమానాలు కలవారు. కాలచక్రం తిరుగుతున్నది. ఒకనాడు దశరథుడు తన మంత్రులు పురోహితులు మొదలైన వారితో సమావేశమయ్యాడు. తన కుమారుల వివాహ ప్రస్తావన చేస్తున్నాడు . సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగు పెట్టాడు మహాతేజశ్శాలియైన విశ్వామిత్ర మహర్షి, సృష్టికి ప్రతిసృష్టి చేయగల సమర్ధుడతడు. దశరథుడు ఎదురేగి సాదరంగా స్వాగతించాడు. అతిథి దేవోభవ- అతిథి మనకు దేవుడితో సమానం . ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రునకు సముచితరీతిన మర్యాదలు గావించాడు. వినయపూర్వకంగా చేతులు జోడించి విశ్వామిత్రుని రాకకు కారణాన్ని అడిగాడు . తన పైన కార్యభారం పెడితే నెరవేరుస్తానన్నాడు. దశరథుని వినయానికి మురిసిపోయాడు విశ్వామిత్రుడు.' వశిష్టుని ఉపదేశాలను పొందినవాడివి. నీవు ఇలాగే ప్రవర్తిస్తావ'ని మెచ్చుకొన్నాడ. విశ్వామిత్రుడు దశరథునితో తాను వచ్చిన పనిని తెలుపుతానన్నాడు. దానిని ఆచరించమన్నాడు. ఆడినమాట తప్పవద్దన్నాడు , అసలు విషయం చెప్పాడు .


ఓ రాజా ! నేనొక యజ్ఞాన్ని సంకల్పించాను. కాని మారీచ, సుబాహులనే రాక్షసులు ఆ యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తున్నారు. వారిని కోపించడానికి , శపించడానికి శక్తి ఉన్నా యజ్ఞదీక్షలో ఉన్నాను కాబట్టి అది నాకు తగనిపని ఉచితానుచితాలు గ్రహించకుండా శక్తిని దుర్వినియోగపరచగూడదు. అందుకు సత్యపరాక్రముడు , శూరుడు అయిన శ్రీరాముణ్ణి పదిదినాలపాటు నా వెంట పంపు . అతడే ఆ రాక్షసులను చంపగల సమర్థుడు . నా వెంట వచ్చి యాగసంరక్షణ చేయడంవల్ల శ్రీరాముడికి అనేక శ్రేయస్సులు కలుగుతాయి. శ్రీరాముడి పరాక్రమమెలాంటిదో నాకు బాగా తెలుసు. నాకే కాదు వశిష్ఠులవారికి, వామదేవాది మహర్షులకూ తెలుసు. వారంతా అంగీకరించిన తర్వాతే రాముణ్ణి నాతో పంపమ'ని అన్నాడు. ఈ మాటలు వింటూంటే దశరథుని గుండెలో రాయి పడ్డది. చేతులు జోడించి ' మహర్షీ ! నా రాముడు పదహారేండ్లు కూడా నిండనివాడు. ధనుర్విద్య ఇంకా పూర్తికాలేదు. యుద్ధవిషయాలతో తగిన పరిచయం లేనివాడు. కనుక దయచేసి నా రాముణ్ణి కోరకండి. అంతగా కావాలంటే ధనుర్బాణపాణినై నేను మీ వెంటవస్తాను. మీ యాగాన్ని సంరక్షించే బాధ్యత నాది. ఇవన్నీ ఎట్లా ఉన్నా రాముణ్ణి వదలి నేను ఒక్క క్షణమైనా బతకలేను, మా నోముల పంట రాముడు. ఇంతకూ ఆ రాక్షసులు ఎవరి అండతో ఈ దుండగానికి ఒడిగట్టార'ని అడిగాడు. విశ్వామిత్రుడు సమాధానమిస్తూ' పౌలస్త్యవంశజుడైన విశ్రవసుడనే ముని కుమారుడు రావణాసురుడు. అతడు కుబేరుని సోదరుడు. అనేక రాక్షస బలాలు కలవాడు .


బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరాలవల్ల అతని గర్వం ఇబ్బడిముబ్బడైంది . ముల్లోకాలనూ అల్లకల్లోలం చేస్తున్నాడు . అటువంటివాడికి యజ్ఞం భగ్నంచేయడమనేది అల్పంగా తోస్తున్నది . అందుకే ఇటువంటి పనులలో పాల్గొనడు . మారీచ , సుబాహులు ఇతనిచేత ప్రేరితులై యజ్ఞాలకు విఘ్నాలను కలిగిస్తున్నారనగానే దశరథుడు మరింత భయపడ్డాడు . ' యుద్ధంలో యమునితో సమానులైన వారి నెదుర్కోవడానికి నా చిన్నిపాపణ్ణి పంపను. నేను కూడా యుద్ధ విషయంలో అశక్తుడనని పలికాడు. దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గిమీద గుగ్గిలమైనాడు . 'ఇచ్చినమాట తప్పటం మీ ఇంటా వంటా లేదు . నీవందుకు సిద్ధపడితే రిక్తహస్తాలతో తిరిగి వెళతాను . మీరు సుఖంగా ఉండండి' అన్నాడు విశ్వామిత్రుడు. పరిస్థితి తీవ్రతను గమనించాడు వశిష్ఠమహర్షి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని దశరథునికి హితవు పలికాడు. మాట నిలబెట్టుకోని వానికి ధర్మకార్యాలనాచరించిన ఫలం నశిస్తుందని హెచ్చరించాడు. వివిధాస్త్ర ప్రయోగదక్షుడైన విశ్వామిత్రుడి వెంట రాముణ్ణి పంపడంలో సంశయానికి తావుండగూడదన్నాడు. రాముణ్ణి పంపితే మేలు జరుగుతుందని సుతిమెత్తగా సూచించాడు . వశిష్ఠుని హితవచనాలకు దశరథుడు తలొగ్గాడు .
రామలక్ష్మణులను పిలిపించాడు. కౌసల్యతో కలిసి ఆశీర్వదించాడు. ప్రశాంతమైన మనస్సుతో విశ్వామిత్రుడికి అప్పగించాడు . విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి అయి రాముడు నడుస్తున్నాడు. లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు. సరయూనదీ తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించారు. ముగ్గురూ, తరవాత రామలక్ష్మణులకు 'బల' “అతిబల' విద్యలనుపదేశించాడు విశ్వామిత్ర మహర్షి. వీటి ప్రభావంవల్ల అలసట, ఆకలిదప్పులుండవు. రూపకాంతులు తగ్గవు. నిద్రలో ఉన్నా, ఏమరుపాటుతో ఉన్నా రాక్షసులేమీ చేయలేరు. ముల్లోకాల్లో ఎదురొడ్డి నిలచేవారుండరు. రాముడు గురుసేవలో నిమగ్నుడయ్యాడు. విశ్వామిత్రుని పాదాలొస్తాడు. సేవలు చేశాడు. గురుసేవ విశేష ఫలితాన్నిస్తుంది . సరయూనదీ తీరంలోనే వాళ్ళు ఆ రాత్రి నిద్రించారు . తెల్లవారుతోంది . విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మేల్కొలుపు పలికాడు . కౌసల్యా సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్. కౌసల్యాదేవి సత్సంతానమైన ఓ రామా! తూర్పున ఉపకాంతులు ప్రసరిస్తున్నాయి. నిద్రలేచి నిత్యకర్మలను ఆచరించమన్నాడు. గురువాక్యం శిరసావహించాడు రాముడు, లక్ష్మణునితో కలసి. మళ్ళీ ప్రయాణం కొనసాగింది. సరయూ గంగానదుల సంగమ ప్రదేశాన్ని చేరుకున్నారు. అక్కడి విశేషాలను గురుముఖతః తెలుసుకున్నారు. జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండడం ఉత్తమ విద్యార్ధుల లక్షణం. ప్రయాణం సాగుతున్నది.' మలద', 'కరూశ అనే జనపదాలకు చేరుకున్నారు. ఇంద్రుని అనుగ్రహ విశేషంచేత ఈ ప్రాంతాలు ధనధాన్యాల సమృద్ధిని కలిగి ఉండేవి . కాని 'తాటక' అనే యక్షిణి ఈ ప్రాంతాలకు వచ్చి విధ్వంసాన్ని సృష్టించింది . పుట్టుకతోనే వేయి ఏనుగుల బలం కలిగిన ఈమెను ఎవరూ ఎదిరించలేకపోతున్నారు. 'అగ్నికి ఆజ్యంతో డైనట్లు' ఈమెతోబాటు ఈమె కుమారుడు 'మారీచుడు' విరుచుకపడుతూ ఈ జనపదాలను అతలాకుతలం చేస్తున్నాడు. దుష్టురాలైన తాటకను వధించమని రాముడితో అన్నాడు విశ్వామిత్రుడు. ఒక్కక్షణం రాముడు మౌనముద్ర దాల్చాడు. రాముడి భావం గ్రహించాడు విశ్వామిత్రుడు . ' స్త్రీని ఎలా చంపాలనే సంశయం వద్దు . అధర్మపరాయణ అయిన తాటకను చంపితే దోషం రాదని కర్తవ్యముపదేశించాడు. వెంటనే రాముడు దృఢనిశ్చయుడై అంజలి ఘటించాడు. 'మీరు చెప్పినట్లుగా నడచుకొమ్మని మా నాన్నగారు నన్ను ఆదేశించారు. వారి ఆజ్ఞ నాకు శిరోధార్యమ'ని పితృవాక్య పరిపాలనాసక్తిని చాటాడు. అలాగే గురువు ఆజ్ఞను పాలించడం శిష్యునిగా తన కర్తవ్యమని భావించి తాటక వధకు ఉద్యుక్తుడైనాడు. వికృతాకారంతో విరుచుకుపడుతున్న తాటక చేతులను తన నిశిత బాణాలతో ఖండించాడు రాముడు. అయినా ఆవేశంతో మీదికి వస్తున్న తాటక ముక్కు చెవులను కోసివేశాడు లక్ష్మణుడు. తాటక ఆవేశం రెండింతలైంది. తాను కనబడకుండా వాళ్ళపై రాళ్ళ వానకురిపిస్తున్నది. ఇదంతా గమనిస్తున్నాడు విశ్వామిత్రుడు. సంధ్యాకాలం సమీపిస్తున్నది. ఈలోపే తాటకను పరలోకానికిపంపమని పురమాయించాడు. అసురసంధ్యాకాలంలో రాక్షసులు మహాబలాన్ని పొందుతారు. ఎదుర్కోవడం కష్టం. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాముడు శబ్దవేధి విద్యను ప్రదర్శిస్తూ బాణ ప్రయోగం చేశాడు. క్షణకాలంలో తాటక నేల పైబడి ప్రాణాలను వదిలింది. తాటక వధతో దుష్ట సంహారానికి పూనుకొన్నాడు రాముడు. ఇంద్రాది దేవతలు రాముణ్ణి స్తుతించారు . సంతుష్టుడైన విశ్వామిత్ర మహర్షి రామునకు ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు. గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేనిదేమిటి ? శిష్యుడు పొందలేనిదేమిటి ?


రామలక్ష్మణ సహితుడయి విశ్వామిత్రుడు 'సిద్ధాశ్రమం' చేరుకున్నాడు. అదే అతని యజ్ఞభూమి. రామలక్ష్మణులు వినయంగా చేతులు జోడించి గురువుగారిని యజ్ఞదీక్షను స్వీకరించమని ప్రార్థించారు. మన్నించాడు మహర్షి యజ్ఞదీక్షితుడయ్యాడు . మరునాడే యజ్ఞం ప్రారంభమైంది . ఆరు రోజులపాటు సాగే ఈ యజ్ఞ విషయంలో అత్యంత జాగరూకులై ఉండమని రామలక్ష్మణులకు సూచించారు మునులు . ఐదురోజులైంది . కంటిమీద కునుకు లేకుండా యజ్ఞాన్ని కాపాడుతున్నారు రామలక్ష్మణులు , కర్తవ్యాన్ని నెరవేర్చడంలో ఇంత నిష్ఠ ఉండాలి. చివరి రోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా యజ్ఞకుండం నుండి జ్వాలలు ఎగసిపడ్డాయి . ఇది రాక్షసుల రాకకు సూచన . మారీచ, సుబాహులు అనుచరులతో వచ్చారు . యజ్ఞవేదిక పరిసరాలు రక్తవర్షంతో తడిసి ముద్దయ్యాయి. రాముడు 'శీతేషువు' అన్న మానవాస్త్రాన్ని మారీచుడిపైకి ప్రయోగించాడు. దాని దెబ్బకు మారీచుడు నూరు యోజనాల దూరం ఎగిరి సముద్రంలో పడిపోయాడు. స్పృహ కోల్పోయి గిరగిరా తిరుగుతూ కొట్టుకుపోతున్నాడు. మరు నిముషంలో ' ఆగ్నేయాస్త్రం'తో సుబాహుని వక్షస్థలాన్ని ప్రక్కలు చేశాడు. 'వాయవ్యాస్త్రం'తో మిగతా రాక్షసుల భరతంపట్టాడు. రాక్షసబాధ తొలగింది. యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది. విశ్వామిత్రుడు సంతోషించాడు. సమర్థులైన శిష్యులను చూసి ఏ గురువు సంతోషించదు? మరునాడు ఉదయాన్నే రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఎదుట వినయంతో నిలిచారు. ఇంకా ఏమి చేయాలో ఆజ్ఞాపించమన్నారు .

విశ్వామిత్రుడు' ఓ రామా! మిథిలానగర ప్రభువు, పరమధార్మికుడైన జనక మహారాజు ఒక యజ్ఞాన్ని చేయ సంకల్పించాడు. మనం అక్కడకి వెళదాం . అక్కడ అద్భుతమైన ఒక మహాధనుస్సుంది. నీవు చూడవచ్చునన్నాడు. సంసిద్ధులయ్యారు రామలక్ష్మణులు. మునిననుసరిస్తూ మిథిలవైపుగా ముందుకు సాగుతున్నారు. అడుగులతోపాటు మాటలు సాగుతున్నాయి. రాముని కోరిక మేరకు తమ వంశ పుట్టు పూర్వోత్తరాలను వివరించాడు విశ్వామిత్రుడు . ఆ రాత్రి శోణానదీ తీరంలో విశ్రమించారు . మరునాడు పవిత్ర గంగానదిని దర్శించారు . స్నానాలాచరించి విధ్యుక్త ధర్మాలను నెరవేర్చారు . గంగా వృత్తాంతాన్ని వినగోరుతున్నానని వినయంగా అడిగాడు రాముడు . వినిపించాడు విశ్వామిత్రుడు . జిజ్ఞాసువులైన శిష్యులు , విజ్ఞాని అయిన గురువు - ఇక జ్ఞాన ప్రసారానికి అడ్డుంటుందా? పాతాళంలో బూడిదకుప్పలై పడివున్న తన పితరులైన సగర పుత్రులకు ఉత్తమగతులు కల్పించడానికి సంకల్పించాడు భగీరథుడు . అందుకు ఒకటే మార్గం ఉంది. సురగంగను వారి బూడిదకుప్పలపై ప్రవహింపజేయడం . కాని ఆకాశంలోని గంగను పాతాళానికి దింపడం ఒక పట్టాన జరిగే పనేనా? అయినా దృఢసంకల్పానికి అసాధ్యమైనది లేదు. భగీరధుడు తీవ్రమైన తపస్సు చేశాడు. బ్రహ్మను, శివుణ్ణి మెప్పించాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంకల్పం నుంచి పక్కకు తప్పుకోలేదు. గంగను పాతాళందాకా తీసుకువెళ్ళడంలో సఫల మనోరథుడయ్యాడు. అందుకే పట్టుదల విషయంలో ‘భగీరథ ప్రయత్నం' అన్న జాతీయం ఏర్పడింది . భగీరథుని వంశంలోని వాడే రాముడు. గంగావతరణాన్ని గురించి విశ్వామిత్రుడు రాముడికి చెప్పడంలో ఒక ఆంతర్యముంది. తన పూర్వికులు ఎంత గొప్పవారో తెలుసుకుని దానికనుగుణంగా నడవడం, పితరులపట్ల ఎంత భక్తి ప్రపత్తులుండాలో తెలపడం. పట్టిన పని ఫలవంతమయ్యేవరకు పట్టుదల ఎలా వుండాలో చెప్పడం, అయితే ఇవన్నీ నేరుగా చెప్పలేదు విశ్వామిత్రుడు. అయినా ఆంతర్యాన్ని గ్రహించాడు రాముడు. ఇదే ఉత్తమ గురుశిష్యుల వ్యవహారం .


మిథిలానగర సమీపానికి చేరుకున్నారు విశ్వామిత్ర రామలక్ష్మణులు. అక్కడ ఒక ఆశ్రమాన్ని చూశాడు రాముడు. అది పాతదైనా అందంగా అగుపిస్తున్నది. కాని జనసంచారమే లేదు. ' ఏమిటీ చిత్రమని అడిగాడు రాముడు . అది గౌతమ మహర్షి ఆశ్రమమని, ఆ కథనంతా వివరించాడు విశ్వామిత్రుడు. 
'మహాతపస్సంపన్నుడైన గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో ఈ ఆశ్రమంలో ఉండేవాడు. ఒకనొక సందర్భంలో అహల్య అపరాధం చేసిందని భావించి ఆగ్రహోదగ్రుడయ్యాడు గౌతముడు. వేల సంవత్సరాలు అన్నపానాదులు లేక వాయువునే ఆహారంగా తీసుకుంటూ ఈ ఆశ్రమంలోనే బూడిదలో పడి ఉందమని ఆమెను శపించాడు. ఎవ్వరికీ కనబడకుండా ఉంటావన్నాడు. రాముని రాకతో శాపవిముక్తి కలిగి నిజరూపాన్ని పొందుతా'వన్నాడు. 'రామా! గౌతమాశ్రమంలో కాలుమోపి అహల్యకు శాపవిముక్తి కలిగించు' అని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు. చుట్టూ బూడిద ఆవరించి ఉంది కఠోరదీక్షలో ఉన్న అహల్య పొగకమ్ముకొన్న అగ్ని తేజస్సులా ఉంది. ఆ మహాత్మురాలిని రాముడు చూశాడు. రాముడి దర్శనంతో ఆమెకు శాపవిముక్తి కలిగింది. అహల్యా గౌతములు రాముణ్ణి యథావిధిగా గౌరవించారు. వారి సత్కారాలందుకొని రాముడు విశ్వామిత్రుని వెంట లక్ష్మణ సహితుడై మిథిలా నగరానికి బయలుదేరాడు .


మిథిలానగరంలో ప్రభువైన జనకమహారాజు వీరిని సముచితంగా సమాదరించాడు. మిథిలలో అహల్యా గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు రామదర్శనం చేసుకున్నాడు. తన తల్లినుద్ధరించినందులకు కృతజ్ఞతాంజలులు సమర్పించాడు. మహాతపశ్శాలియైన విశ్వామిత్రుని అనుగ్రహం పొందగలగడం చాలా విశేషమని రాముణ్ణి మెచ్చుకున్నాడు. విశ్వామిత్ర మహర్షి అసాధాణ శక్తిసామర్థ్యాలను వివరించాడు శతానందుడు, మరునాడు ప్రాతఃకాలంలో జనకుడు విశ్వామిత్ర రామలక్ష్మణులను ఆహ్వానించాడు. కర్తవ్యోపదేశం చేయవలసిందిగా విశ్వామిత్రుణ్ణి ప్రార్ధించాడు. అప్పుడు ప్రత్యుత్తరమిస్తూ విశ్వామిత్రుడు' వీరు దశరథ మహారాజు కుమారులు. జగత్ప్రసిద్ధులైన వీరులు. మీ దగ్గర ఉన్న ధనుస్సును చూడాలనుకుంటున్నారు. దాన్ని చూపించండి. శుభం జరుగుతుంది. వాళ్ళ ముచ్చటా తీరుతుందన్నాడు. అప్పుడు జనకుడు తనదగ్గరున్న 'శివధనుస్సు' చరిత్రను వివరించాడు. యాగం కోసం భూమిని దున్నుతుండగా ఒక పాప దొరికిందని, నాగటిచాలున దొరికినందువల్ల ఈమెకు ' సీత ' అనే పేరు వచ్చిందని చెపుతూ ఆమెను గొప్ప పరాక్రమవంతుడికివ్వాలన్న తన అభిమతాన్ని వెలిబుచ్చాడు. శివధనుస్సును ఎక్కుపెట్టగలవాడే సీతకు తగిన భర్త అన్నాడు. గతంలో ఎందరో రాజులు వచ్చి శివధనుస్సు ఎక్కుపెట్టడానికి విఫల ప్రయత్నం చేశారని, ఎక్కుపెట్టడం మాట ఎలా ఉన్నా కనీసం కదలించలేకపోయారన్నాడు. ఇదంతా విని శివధనుస్సును తెప్పించమన్నాడు విశ్వామిత్రుడు . సరేనన్నాడు జనకుడు. బలిష్ఠులు, దీర్ఘకాయులైన ఐదువేల మంది అతికష్టం మీద శివధనుస్సుతో కూడిన పేటికను తీసుకువచ్చారు.
 

విశ్వామిత్ర మహర్షి అనుమతితో ధనుస్సు మధ్యభాగాన్ని అవలీలగా పట్టుకున్నాడు రాముడు. ధనుర్విద్యయందు ఆరితేరిన రాముని చేయి సోకినంతనే ఆ ధనుస్సు వంగింది. వింటినారిని సంధించాడు. వేలకొలది సదస్యులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. అల్లెతాడును ఆకర్ణాంతంగా లాగాడు రాముడు. పిడుగుపాటులా భయంకర శబ్దాన్ని చేస్తూ విల్లు ఫెళ్ళున విరిగింది. విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు తప్ప మిగతావారంతా మూర్చపోయారు. ఇచ్చినమాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యాడు. దశరథ మహారాజుకు వర్తమానం పంపాడు. అయోధ్యనుంచి అందరూ తరలివచ్చారు. జనకుడు తన కుమార్తెలైన సీతను, ఊర్మిళలను రామలక్ష్మణులకు, తన తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలైన మాండవిని, శ్రుతకీర్తులను భరతశత్రుఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు . అంగరంగ వైభవంగా జరిగాయి కల్యాణాలు . 


మరునాడు విశ్వామిత్ర మహర్షి కొత్త దంపతులను ఆశీర్వదించి, దశరథ జనకమహారాజులను వీడ్కొని హిమాలయ పర్వతానికి వెళ్ళాడు. తరవాత బంధుమిత్ర సమేతంగా దశరథుడు అయోధ్యకు బయలుదేరాడు. దారిలో వీళ్ళకు పరశురాముడు ఎదురుగా వచ్చాడు . అతడు ప్రళయకాల రుద్రుడిలా ఉన్నాడు. గండ్రగొడ్డలిని , ధనుర్బాణాలను ధరించాడు . ప్రజ్వరిల్లే అగ్నిలా భయంకరంగా ఉన్నాడు . క్షత్రియులంటే ఇతనికి సరిపడడు. పూర్వం క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు ఇతని తండ్రి అయిన జమదగ్నిని చంపాడు . అప్పటి నుండి క్షత్రియ నిర్మూలనానికి కంకణం కట్టుకున్నాడు . ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షిణం చేసి ఎంతోమంది క్షత్రియులను తన గండ్రగొడ్డలికి బలిచేశాడు. పరశురాముడు శ్రీరామునితో తనదగ్గరున్న వైష్ణవ ధనుస్సునెక్కుపెట్టమని సవాలు విసిరాడు. సరేనని రాఘవుడు అవలీలగా ఎక్కుపెట్టాడు. ఓటమినంగీకరించిన పరశురాముడు తక్షణమే మహేంద్రపర్వతానికి వెళ్ళిపోయాడు దశరథుడు సపరివారంగా అయోధ్యకు చేరుకున్నాడు. భరతుడు శత్రుఘ్నునితో మేనమామ వెంట తాతగారింటికి వెళ్ళాడు. రామలక్ష్మణులు తల్లిదండ్రుల సేవలో, గురువుల సేవలో తరిస్తూ అయోధ్యలోనే ఉండిపోయారు. 




3 comments:

ThanQ for your comment...